సంక్షేమ పథకాలు అందిస్తున్న సర్కార్ ను ఆదరించాలి : మంత్రి తన్నీరు హరీష్ రావు

by Disha Web Desk 1 |
సంక్షేమ పథకాలు అందిస్తున్న సర్కార్ ను ఆదరించాలి : మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, జహీరాబాద్: సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఆదరించాలని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కాకి జనవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలకు ఆగం కావొద్దన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ప్రజల ముందుకు వస్తున్న బీజేపీ నాయకులు పక్కనున్న కర్ణాటకలోని బీదర్ లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆశలు కల్పిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఉచిత కరెంట్, ఆసరా పెన్షన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాల అమలవుతున్నాయా అంటూ ప్రశ్నించారు. సర్పంచ్ వీరారెడ్డి గ్రామం కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. గ్రామం అభివృద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని కరెంట్, రోడ్లు, మురుగు కాలువల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీటీసీ స్వప్న భాస్కర్, మైనారిటీ కమిషన్ సభ్యులు ఎండీ తన్వీర్, బీఆర్ఎస్ జహీరాబాద్ మండలాధ్యక్షులు, ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం అధ్యక్షులు హుగ్గెల్లి రాములు, గిరిజన నాయకులు శ్రీనివాస్, వాసునాయక్, పార్టీ న్యాల్కల్ మండలాధ్యక్షుడు రవీందర్, బీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story