కొమురవెల్లిలో చోరీ కేసు ఛేదన.. రూ.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

by Taduka Kalyani |

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

కొమురవెల్లిలో చోరీ కేసు ఛేదన.. రూ.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
X

దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొమురవెల్లికి చెందిన సార్ల సురేష్ (39) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేయగా, ఈ ఏడాది మే 30న కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జూన్ 23న కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేచరేణి గ్రామ శివారులో ఉన్న గుర్జకుంట కమాన్ వద్ద ఎస్‌ఐ టి. మహేష్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితులను డొంగరి రాజు (31), పొట్ట ప్రవీణ్ (29), బొద్దుల శ్రీనాథ్ (28)గా గుర్తించారు. వీరు కొమురవెల్లి పరిధిలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ చేసి బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు అంగీకరించారు. అంతేకాకుండా, గతంలో మెదక్ జిల్లా కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపల దుకాణంలో ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించినట్లు, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మొబైల్ షాపు నుంచి హెచ్‌పీ ల్యాప్‌టాప్, సీసీటీవీ మానిటర్‌ను చోరీ చేసినట్లు కూడా ఒప్పుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

పోలీసులు నిందితుల వద్ద నుంచి కింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

హెచ్‌పీ కంపెనీ ల్యాప్‌టాప్

సీసీటీవీ మానిటర్

3 తులాల బంగారు గొలుసు

7 గ్రాముల బంగారు ఆభరణాలు

8 తులాల వెండి పట్టగొలుసులు

1 తులం వెండి కుంకుమ భరణి

1 తులం వెండి ఉగ్గు గిన్నె

3 మొబైల్ ఫోన్లు

నేరాలకు ఉపయోగించిన పల్సర్ ఎన్‌ఎస్-200 మోటార్ సైకిల్ (TS16EW5296)

యాక్టివా స్కూటర్ (TG08G8637)

మొత్తం రూ.7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చెరియాల్ సీఐ బి. రమేష్, కొమురవెల్లి ఎస్‌ఐ టి. మహేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్‌ఐ తిరుపతి రెడ్డి తదితర సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.

Next Story