ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

by Disha Web Desk 1 |
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, నర్సాపూర్ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్ద చింతకుంట లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తల్లడిల్లుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని సిబ్బంది సూచించారు. తేమ శాతం కాస్త అటు ఇటు ఉన్న తూకం వేయాలన్నారు.

రైతులు కూడా ప్యాడి క్లినర్లలో ధాన్యం తూర్పార బట్టి తాళ్లు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు వెనువెంటనే తరలిస్తూ మిల్లర్లు కూడా 24 గంటలలోగా ధాన్యం దించుకునేలా పర్యవేక్షించాలన్నారు.

టాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 6,458 మంది రైతుల నుంచి రూ.56.77 కోట్ల విలువ గల 27,560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.7.18కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని, త్వరలో మిగతా డబ్బు రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆంజనేయులు, వ్యవసాయ అధికారులు, కేంద్రం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed