బ్రెయిన్ డెడ్ తో యువకుడి మృతి.. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

by Disha Web Desk 1 |
బ్రెయిన్ డెడ్ తో యువకుడి మృతి.. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
X

దిశ, దుబ్బాక: బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 20వ వార్డుకు చెందిన మంతూరి శ్రీనివాస్ (36) చేనేత కార్మికుడు చేనేత వృత్తితో పాటు కుటుంబాన్ని పోషించేందుకు కూలి పని చేస్తుండేవాడు. మృతుడికి తల్లి శంకరమ్మ, భార్య లావణ్య, ఇద్దరు ఐదేళ్ల లోపు ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత ఐదు రోజుల క్రితం శ్రీనివాస్ కు రక్తపోటు అధికంగా పెరగడంతో మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో గురువారం గుండె పోటు, ఫిట్స్ రావడంతో కోమాలోకి వెళ్లిన శ్రీనివాస్ బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో వైద్యులు విజ్ఞప్తి మేరకు అవయవ దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. శ్రీనివాస్ యొక్క గుండె, ఊపిరితిత్తులు, కాలేయాన్ని తీసి, భద్రపరిచారు. అనంతరం మృతదేహాన్ని దుబ్బాకకు తరలించారు.

భర్త మరణంతో రోడ్డున పడిన కుటుంబం..

శ్రీనివాస్ మృతితో భార్య లావణ్య, ఇద్దరు కూతుళ్లు విబుష, శ్రీకృతిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కెవ్వరంటూ స్థానికులు సైతం రోదించారు. మృతుడి కుంటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పద్మశాలి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


Next Story