తెలంగాణ దేశానికే రోల్ మోడల్ : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
తెలంగాణ దేశానికే రోల్ మోడల్ : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. నంగునూరు మండలం భాషాయి గూడెం-తిమ్మాయిపల్లి గ్రామాల్లో శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుకు విలువ పెంచారన్నారు. సంక్షేమంలోనైనా.. అభివృద్ధిలోనైనా.. సిద్ధిపేట నియోజకవర్గ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాని పేర్కొన్నారు. అకాల వర్షాలు, వడగళ్లతో చేతికొచ్చే పంట నష్టపోయామని తెలిపారు.

వానాకాలం పంట నెల ముందుకు జరపాలని రైతులకు సూచించారు. తిమ్మాయిపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో విలేజ్ ఫంక్షన్ హాల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో దొమ్మాట నియోజకవర్గ పరిధిలో కలిసి ఉన్నపుడు ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదన్నారు. ఈ తొమ్మిదేళ్లలో గ్రామం నుంచి నర్మెట్ట, కొనాయపల్లి, వెంకటాపూర్, బందారం గ్రామాలకు రహదారులు వేసుకున్నామని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవనీ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా, ఆసరా ఫించన్లు, రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా నిలిపిన ఘనత గ్రామ ప్రజలదేనని, మీ భాగస్వామ్యంతో తిమ్మాయిపల్లి ఆదర్శ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో పేరుపొందిందని తెలిపారు. పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తున్నదని రైతులంతా సద్వినియోగం చేసుకుని పామాయిల్ తోటలు పెంపకానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

యాసంగిలో వరికి తెగులు వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా రసాయనిక ఎరువులు తగ్గించి పంట మార్పిడి చేస్తే ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనుము, జీలుగు, పచ్చిరొట్టె విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని రైతులను మంత్రి కోరారు. అంతకు ముందు గ్రామంలో మంగళ హారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్ది మంత్రిని గ్రామస్థులు స్వాగతించారు. అలాగే హనుమాన్, పెద్దమ్మ, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ మండపం శంకుస్థాపన, కామరతి-బీరప్ప ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదే విధంగా గ్రామ మహిళా మండలి భవనం, యూత్ భవనంకు శంకుస్థాపన, తిమ్మాయిపల్లి నుంచి నర్మెట్ట వరకూ రూ.86 లక్షల వ్యయంతో రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, గ్రామ నాభి శిల బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం, యూత్ బిల్డింగ్ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన, చివరగా గ్రామ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed