దేశానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
దేశానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ధాన్య భాండాగారంగా నిలిచిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల, నందిగామ, లకడారం గ్రామాల పరిధిలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల రైతులు నిర్వహించిన ర్యాలీలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకుల వివక్ష, నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆత్మ బంధువుగా నిలిచాయని అన్నారు. పంట పెట్టుబడి సమయంలో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి సాయం రైతన్నకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు.

గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే.. పెద్దకర్మ అయ్యే లోపు రూ.5లక్షల రూపాయల బీమా సొమ్ము అందిస్తున్న ఘటన కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రతి ఏటా అంచనాలకు మించి పంటలు ఉత్పత్తి కావడంతో పాటు, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. రైతన్నకు పెద్ద కొడుకు వలె పరిపాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ కు యావత్ రైతాంగం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, సీఐలు వేణుగోపాల్ రెడ్డి, వినాయక్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed