Sigachi Incident : సిగాచీ యాజమాన్యం కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamylaram) పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే.

Sigachi Incident : సిగాచీ యాజమాన్యం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamylaram) పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 44 మంది మరణించగా, 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. ఈ ఘటనలో ఆచూకీ లభించని 8 మంది కార్మికులు మరణించినట్టు నేడు అధికారులు ప్రకటించారు. పేలుడు అనంతరం రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్ ల ఆచూకీ లేకుండా పోయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(CFSL)కు పంపిన 100కు పైగా DNA నమూనాలు ఈ 8 మంది కుటుంబ సభ్యుల DNAతో సరిపోలలేదు.

దీంతో వారు పూర్తిగా కాలి బూడిదైనట్లు అధికారులు భావిస్తున్నారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారులు ఈ కుటుంబాలకు రూ.15 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు. ఇది మరణ ధృవీకరణ పత్రాలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు బాధిత కుటుంబాలను స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. ఆచూకీకి సంబంధించిన ఏదైనా సమాచారం లభిస్తే తెలియజేస్తామని, మూడు నెలల తర్వాత మళ్లీ అందరినీ పిలుస్తామని తెలియజేశారు.

ఈ ఘటనలో మొత్తం 143 మంది కార్మికులు ఉండగా, 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. అలాగే 44 మంది మరణించగా.. మరో 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిగాచి ఇండస్ట్రీస్ మరణించినవారి కుటుంబాలకు రూ.1 కోటి, తీవ్రంగా గాయపడినవారికి రూ.10 లక్షలు, స్వల్ప గాయాలతో బయటపడినవారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరణించినవారి కుటుంబాలకు రూ.1 లక్ష, గాయపడినవారికి రూ.50,000 తక్షణ సహాయం అందజేస్తోంది.

Next Story