రూ. 3 లక్షలకు పసి కందు అమ్మకం..!

by Ratna Kumari |

పుట్టిన బిడ్డను పోషించే ఆర్థిక స్థోమత లేని ఓ గిరిజన దంపతులు అప్పుడే పుట్టిన శిశువుని విక్రయించిన ఘటన మెదక్ జిల్లా కే కేంద్రంలో జరిగింది.

రూ. 3 లక్షలకు  పసి కందు అమ్మకం..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : పుట్టిన బిడ్డను పోషించే ఆర్థిక స్థోమత లేని ఓ గిరిజన దంపతులు అప్పుడే పుట్టిన శిశువుని విక్రయించిన ఘటన మెదక్ జిల్లా కే కేంద్రంలో జరిగింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పట్టణ పోలీసు స్టేషన్ లో సి ఐ మహేష్ తో కలసి బుధవారం వివ‌రాల‌ను వెల్లడించారు. కొల్చారం మండలం పోతిరెడ్డి పల్లి తండాకు చెందిన శిరీష, దేవి సింగ్ దంపతులకు మెదక్ మాత శిశు ఆరోగ్య కేంద్రం లో శిశువు జన్మించింది. అప్పటికే ఆ దంపతులకు ముగ్గురు సంతానం ఉండడం తో నాల్గవ సంతానం పోషించడం భారంగా భావించారు. విషయాన్ని బంధువులైన వారికి చెప్పడం తో వారు మధ్యవర్తుల ద్వారా కొత్వాల్ మండలం అల్లినగర్ కు చెందిన బొమ్మ కమలమ్మ, లింగయ్య లను సంప్రదించారు. వారికి సంతానం లేకపోవడం తో పసి పాపను కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మధ్యవర్తులు కలిసి గత నెల ఒకటో తేదీన ఆసుపత్రి సమీపంలోని ఓ ట్రాక్టర్ షోరూం వద్ద బేరం మాట్లాడారు. రూ 3 లక్షలకు కొనుగోలు చేసి పసి కందును తీసుకు వెళ్ళారు.

గర్భవతిగా ఉన్న శిరీష్ బిడ్డను కన్న తర్వాత కూడా వారి వద్ద లేకపోవడం తో స్థానిక అంగ‌న్ వాడీ టీచ‌ర్ సూప‌ర్ వైజ‌ర్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే వారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విక్రయానికి సంబంధించిన వివరాలు సేకరించి శిశువుని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన పాత్ర ఆర్మూర్ కు చెందిన శారద వ్యవహరించినట్టు తెలిపారు. ఆమెతో పాటు అమ్మిన, కొనుగోలు చేసిన తల్లిదండ్రులు, మధ్యవర్తిత్వం వహించిన సోనీ, మంగల్ పర్తి కి చెందిన ధర్మసోత్ రాజు, సంగాయిగూడ కు చెందిన ప్రేమిల, ఔరంగాబాద్ తండాకు చెందిన మహేందర్, మిడ్ మామిడిబాను తండాకు చెందిన భాస్కర్ లు ఉన్నట్లు తెలిపారు. పది మందిపై కేసు నమోదు చేసి తొమ్మిది మందిని రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ వెల్లడించారు. శిశువు తండ్రి దేవి సింగ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిధితులను రిమాండ్ కు తరలించిన వారి వద్ద ఆరు మొబైల్ ఫోన్ లు, రూ. 38 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శిశు విక్రయాలకు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ ఐ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

మూడు లక్షల్లో మధ్యవర్తుల చేతికే డబ్బులు

శిశువు విక్రయం కేసులో మధ్యవర్తిత్వం వచ్చిన వారే డబ్బులు నొక్కేసి తల్లి దండ్రులకు కేవలం 40 వేలు.మాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. ఆర్మూర్ కు చెందిన శారద పసి పాప విక్రయం లో కీలకంగా వివరించి రూ. 2.10 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. ఆర్థికంగా బలహీనంగా ఉండే గిరిజన తల్లి తల్లిదండ్రులను గుర్తించి వారికి కొంత డబ్బు ఆశ చూపి శిశు విక్రయాలు చేస్తున్నట్టు తెలిసింది. డబ్బుల వ్యవహారంలో కూడా మధ్యవర్తుల మధ్య విబేధాలు వచ్చినట్టు తెలిసింది.

Next Story