పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

by Taduka Kalyani |

మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్‌ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, ములుగు: మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్‌ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉన్న ములుగు ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా అధిక వేగంతో వెళ్తున్న కంటైనర్ కనిపించడంతో వెంటనే వెంబడించి నిలిపివేశారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 84 పశువులను అత్యంత దారుణ పరిస్థితుల్లో తాళ్లతో బంధించి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా తేలింది. పశువుల రవాణాకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, సంబంధిత పత్రాలు లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రాథమిక విచారణలో హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి సంగారెడ్డి వైపు పశువులను తరలిస్తున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిందితులపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం తదితర సెక్షన్ల కింద చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story