చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Shiva Kumar |
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, రాయపోల్: మూడేళ్ల క్రితం గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో వద్ద రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రాయపోల్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి ఎలక్షన్ (38) దినపత్రిక ఏజెంట్, అదేవిధంగా తనకు ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.

మూడేళ్ల క్రితం గజ్వేల్ లో పేపర్ సర్కులేషన్ చేసేందుక బైక్ పై బయలుదేరిన ఎలక్షన్ ను ప్రజ్ఞాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా కొద్ది రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతోనే బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఎలక్షన్ ను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య బాల లక్ష్మి, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ మహబూబ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఎలక్షన్ గత 20 ఏళ్ల నుంచి వివిధ దిన పత్రికల్లో సర్కులేషన్ ఏజెంట్ గా విధులు నిర్వర్తిస్తూ రాయపోల్, గజ్వేల్ ప్రాంతాల్లో పలువురు మన్ననలు పొందాడు. అందరితో కలుపుగోలుపుగా ఉంటూ.. ఆప్యాయతతో మెలిగేవాడు. అలాంటి ఎలక్షన్ మృతితో రాయపోల్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed