అభివృద్ధిలో పరుగులు పెడుతున్న పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
అభివృద్ధిలో పరుగులు పెడుతున్న పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. 13 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతో పాటు సీఎం కేసీఆర్ సహకారంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. తొమ్మిదేళ్ల కాలంలో పటాన్ చెరు రూపురేఖలు మార్చడంతో పాటు ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేశామని తెలిపారు.

ప్రధానంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణతో ప్రతి గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడంలో సఫలీకృతులమయ్యామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో వచ్చే సీఎస్సార్ నిధులతో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు.

ప్రజల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని భరోసానిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాండు, పట్టణాధ్యక్షులు అఫ్జల్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed