మైనంపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. పద్మారెడ్డి

by Disha Web Desk 20 |
మైనంపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. పద్మారెడ్డి
X

దిశ, పాపన్నపేట : గతంలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని, 13 ఏళ్లుగా మెదక్ నియోజకవర్గానికి మైనంపల్లి హనుమంతరావు ఒక్కసారి కూడా రాలేడని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం పాపన్నపేటలో ఆధునిక వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రంను ప్రారంభించారు. 36 గ్రామపంచాయతీలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ అనంతరం బాచారం గ్రామంలో 48 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి అర్హులకు పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెసోళ్లకు పదవులే తప్ప అభివృద్ధి అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గం అభివృద్ధిని మర్చిపోతారని, ఇటువైపు కూడా చూడరని అన్నారు. వారిని కలవాలంటే ఢిల్లీకో ఏ కువైటుకో పోవాల్సి వస్తుందన్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తట్టుకొని అభివృద్ధి కోసమే పని చేస్తామన్నారు. గుండు వాగు ద్వారా మండలాన్ని సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, దళిత బంధు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. సాగునీటి కోసం గతంలో జీపులు, కార్లు కట్టుకొని పోయి మంత్రుల కాళ్ళవేళ్ల పడ్డామన్నారు. ఇప్పుడు ఆ దౌర్భాగ్య పరిస్థితి లేదని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బాచారం గ్రామానికి పాఠశాల భవనం, గుండువాగుకు రెండు గేట్లు, మినీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని గ్రామ సర్పంచి కోరడంతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల ఆలయ పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు వెంకట్ రాములు, గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed