రాష్ట్ర పథకాలను అభినందించిన నీతిఆయోగ్..

by Disha Web Desk 20 |
రాష్ట్ర పథకాలను అభినందించిన నీతిఆయోగ్..
X

దిశ, మెదక్ ప్రతినిధి : వైద్య సిబ్బంది సేవలు అనన్య సామాన్యం, వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక మాయా గార్డెన్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభిస్తూ 20 మంది గర్భిణులకు అందజేశారు. ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో రోగుల బీపీని పరీక్షించుటకు డిజిటల్ బీపీ మిషన్లను అందజేశారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సాధించిన ప్రగతి పై కరపత్రాలను ఆవిష్కరించగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందునాయక్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంత సంపాదించిన ఆరోగ్యం సరిగ్గా లేకపోతె వృధా అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో ఎనీమియా తగ్గించుటకు, ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిచ్చుటకు విటమిన్లతో కూడిన పౌష్టికాహార కెసీఆర్ కిట్లను అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వైద్య విధానంలో మార్పులు తెచ్చి ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, అవసరమైన సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నదని అన్నారు.

ప్రతి ఆరోగ్య ఉప కేంద్రానికి నూతన భవనాలు నిర్మిస్తున్నదని అన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ లో తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ర్యాంకింగ్ లో 3వ స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్ లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వనప్పటికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ముఖ్యమంత్రి 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారని, ఇప్పటి వరకు 21 జిల్లాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయని అన్నారు. మన జిల్లాలో త్వరలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసుకోవడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభించుకోనున్నామన్నారు. రాత్రింబవళ్లు వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని, కరోనా కాలంలో వారి సేవలు మరువరానివని అన్నారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఒకే రోజు 25 ప్రసవాలు నిర్వహించి రికార్డు నెలకొల్పారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బంది కృషివల్ల నేడు 81 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులలో జరుగుచున్నాయని, శిశు మరణాలు కూడా తగ్గాయని అన్నారు. సి సెక్షన్ ఆపరేషన్లు కూడా 65 శాతం నుండి 45 శాతం తగ్గించామని, ఇంకా తగ్గించడానికి కృషిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్ధిక వైద్య, ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావులు అహర్నిశలు శ్రమిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మాడల్ గా నిలిచిందని అన్నారు.

ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాలో పాల్గొన్న పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా ఇట్టి కార్యక్రమాన్ని మెచ్చుకొని తమ రాష్ట్రాలలో కూడా అమలుచేస్తాననడం, నీతి ఆయోగ్ కూడా మన కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఆసుపత్రులను బలోపేతం చేస్తూ మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా అత్యధిక సంఖ్యలో సాధారణ ప్రసవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాల్లో డయాల్సిస్ కేంద్రం, ఐసియు యూనిట్ ప్రారంభించుకోవడంతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు.

రెండవ విడత కంటి వెలుగు ద్వారా జిల్లాలో 4 లక్షల 70 వేల మందిని పరీక్షించి 49 వేల ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామన్నారు. 102, 108 అంబులెన్స్ ల ద్వారా సేవలందిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది ఇదే స్పూర్తితో ఇకముందు కూడా బాగా పనిచేస్తూ జిల్లాను అన్ని పారామీటర్లలో అగ్రభాగాన నిలపాలని కోరారు.

అనంతరం అతిధులు బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన నలుగురు ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ లు ప్రధానం చేయడంతో పాటు, వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, వై.యెన్.ఏం. ఆశా కార్యకర్తలు తదితరులకు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, డిఎమ్ అండ్ హెచ్ ఓ చందు నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, డా.శివదయాళ్, చంద్రశేఖర్, నవీన్, పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed