సుప్రీంకోర్టుకు చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే కేసు

by Disha Web Desk 12 |
సుప్రీంకోర్టుకు చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే కేసు
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: పూర్తి స్థాయిలో సాక్షాదారాలు పరిశీలించిన తర్వాత పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చిందని అదే తీర్పును కొనసాగించాలని, హైకోర్టు ఇచ్చిన స్టేనే రద్దు చేయాలని పటాన్ చెరుకు చెందిన అడ్వకేట్ ముఖీం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సుప్రీంలో పిటిషన్ వేశారు. 2014లో పటాన్ చెరు పట్టణ సమీపంలో ఓ కంపెనీ పై జరిగిన దాడి ఘటనలో మహిపాల్ రెడ్డిని సంగారెడ్డి న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.

రెండున్నరేండ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించింది. పాశమైలారంలో ఓ పరిశ్రమ వద్దకు తన అనుచరులతో వెళ్లి దాడి చేసిన బెదిరించిన ఘటనలో ఈ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కోర్టు శిక్ష విధించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే పదవి పై అనర్హత వేటు పడనున్నదని అని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అయన హైకోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి ఇచ్చిన కోర్టు తీర్పు పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యే ఎప్పటిలాగే ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ కేసులో పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించిందని అలాంటి కేసులో హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని పటాన్ చెరు న్యాయవాది ముఖీం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్తానం విచారణ మొదలు పెట్టింది.

కాగా త్వరలోనే కోర్టు నుంచి మహిపాల్ రెడ్డి కి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందని, పూర్తి స్థాయిలో విచారించి, అవసరమైతే కింది కోర్టు తీర్పును అమలు చేసే అవకాశం ఉన్నదని అడ్వకేట్ ముఖీం దిశ ప్రతినిధితో వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ పై సుప్రీంలో కేసు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దీంతో మహిపాల్ రెడ్డి ఏ విధంగా ముందుకు సాగనున్నారో వేచి చూడాల్సి ఉన్నది.

Next Story

Most Viewed