తెలంగాణ దేశానికే ఆదర్శం.. మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 13 |
తెలంగాణ దేశానికే ఆదర్శం.. మంత్రి హరీష్ రావు
X

దిశ, పాపన్నపేట: తెలంగాణ రాష్ట్రాన్ని మన సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధి లక్ష్మీ నగర్‌లోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించే నాయకురాలని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు.

మన నియోజకవర్గానికి కూడా మన పార్టీ వారే ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మెదక్‌లో సైతం పద్మాదేవేందర్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. హైదరాబాదు నుంచి బెంజ్ కారులో వచ్చి ఆత్మగౌరవం గురించి మాట్లాడే వాళ్లను నమ్మొద్దన్నారు. మెదక్ నియోజకవర్గానికి, మన బీఆర్ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని.. మన భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఎన్నికలేనని గుర్తు చేశారు.

పదేళ్ల కిందట పాపన్నపేట మండలం ఎలా ఉండేదని.. ఇప్పుడు ఎలా ఉందో అందరూ ఆలోచించాలన్నారు. గతంలో ఎరువులు, నీళ్లు, కరెంటుకు ఎన్ని గోసలు పడ్డామో గుర్తు ఉండే ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్ మండిపడ్డాడు. రైతుబంధు బిచ్చం వేస్తున్నాం అనడం సిగ్గుచేటన్నారు. ప్రతి రైతుకు రూ.15 వేలు అని కుట్ర చేస్తున్నది కాంగ్రెస్. ఎన్ని ఎకరాలు ఉన్నా రూ. 15 వేలు ఇస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతి ఎకరానికి రూ.16 వేలు అంటే కాంగ్రెస్ ప్రతి రైతుకు రూ.15 వేలు అంటున్నదని, ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మంచి మేనిఫెస్టో అని, అది ప్రజలందరికీ చేర్చాలని కార్యకర్తలకు సూచించారు. రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం, సౌభాగ్య లక్ష్మీ ద్వారా మహిళలకు రూ.3 వేలు ఇవ్వబోతున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 4 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నమన్నారు. రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల బీమాను కోటి కుటుంబాలకు చెయ్యబోతున్నామని పేర్కొన్నారు. గెలిచిన అనంతరమే ఆసరా పింఛన్లు రూ.5 వేలు అందించనున్నామన్నారు. అలాగే అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల చికిత్సను ఉచితంగా అందించనున్నామని పేర్కొన్నారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని, మోసపోతే గోస పడతామన్నారు. పదేళ్ల పాలనలో ఎంతో మార్పు వచ్చిందని, ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇందిరా గాంధీ వచ్చినప్పటినుండి జిల్లా చేస్తా అని మాట తప్పారన్నారు. జిల్లా కేంద్రం కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అభివృద్ధి చేశారన్నారు. విష ప్రచారాలను తిప్పి కొట్టి మెదక్‌లో గులాబీ జెండా ఎగరవేయాలన్నారు. అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.



Next Story

Most Viewed