కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్

by Disha Web Desk 12 |
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి/దిశ కొండపాక : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటూ.. నకలు కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తూనే గల్లీలో వచ్చి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, తన పశు వైద్య కళాశాల, భవన సముదాయాలకు పశుసంవర్ధక, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం దేశానికే దిక్సూచి గా మారిందన్నారు. గొర్రెల పంపిణీ పథకంతో ఒకప్పుడు మాంసం దిగుమతి చేసుకున్న రాష్ట్రం నేడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది అన్నారు.

మూడు శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 38 శాతం అవార్డులు, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటే అది సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ నిర్మాణానికి నాటి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో పివి ఘాట్ నిర్మించడంతో పాటు, వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టి గౌరవించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా కాళోజీ పేరిట హెల్త్ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట హార్టికల్చర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చెరువులు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయన్నారు. విద్య కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2014 తో పోలిస్తే నేడు తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో 372,000 మంది మత్స్యకారులకు సభ్యత్వం అందించడం జరుగుతుందన్నారు. నీకు తోడు మరో లక్ష మందికి సభ్యత్వాలు అందించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మాదిరి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సైతం లేదన్నారు.

75 సంవత్సరాల్లో ఎవరు చేయని పనులు సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్నారు 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు మెంబర్ షిప్, 18 సంవత్సరాల నిండిన గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మంత్రి హరీష్ రావు లాంటి నాయకుడు సిద్దిపేట ప్రజలకు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed