ధాన్యం కొనుగోళ్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి : మంత్రి గంగుల కమలాకర్

by Disha Web Desk 20 |
ధాన్యం కొనుగోళ్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, సంగారెడ్డి : క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. గతేడాది 28.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే పది లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ఈ సారి 4.55 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా అదనంగా 400 కొనుగోలు కేంద్రాలను సైతం అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు ఊరట నందించిందన్నారు. 21 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం రవాణాకు ఆటంకాలు తలెత్తకుండా అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 13,730 మంది రైతుల నుండి 67,230 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రికి తెలిపారు. ఇప్పటివరకు 43 కోట్ల 82 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఎస్ఓ వనజాత, డీఎం సుగుణ బాయ్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed