వైభవంగా శత చండి మహాయాగం

by Disha Web Desk 1 |
వైభవంగా శత చండి మహాయాగం
X

దిశ, ఝరాసంగం: లోక కళ్యాణార్ధం ఝరాసంగం కేతకి సంగమేశ్వర దేవస్థానంలో చైర్మన్ వెంకటేశం, దేవస్థానం ఈవో శశిధర్ ఆధ్వర్యంలో చేపట్టిన శత చండి మహాయాగం రెండో రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. గురుపూజతో ప్రారంభమైన గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, మంఠపారాధన, ఆవాహిత దేవత పూజ, శ్రీ యంత్ర పూజ, శ్రీ చండీ పారాయణం, మహా మంగళహారతి యోగినిబలి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు, ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పరవశించిపోయింది. సాయంత్రం నవార్ణ జపం, మంగళ హారతి, రజోపచారపూజ వేద మంత్రోచ్ఛారణలు, నడుమ జరిగాయి. చండీ పారాయణాలు, హవనాదులు చేస్తూ చండీ యాగం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. యాగంలో పాల్గొన్నందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

యాగానికి హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు

సంగమేశ్వర స్వామి దేవాలయంలో కొనసాగుతున్న శతచండి మహా యాగానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ హాజరయ్యారు. ముందుగా వారికి రాజగోపురం వద్ద ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వారు నేరుగా స్వామి వారి అమృత గుండంలో జల లింగానికి పూజలు చేశారు.

అనంతరం గర్భాలయంలో ఉన్న పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి యాగశాలకు వెళ్లారు. అక్కడ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని చేస్తున్న శతచండీ మహా యాగం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే మాణిక్ రావు నిర్వాహకులను అభినందించారు. వారికి దేవాలయ చైర్మన్ నీల వెంకటేశం పూలమాల శాలువాలకు సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story

Most Viewed