పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని రాజన్న జోన్-3 డీఐజీ సున్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని రాజన్న జోన్-3 డీఐజీ సున్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ను మంగళవారం రాజన్న జోన్-3 డీఐజీ సున్‌ప్రీత్ సింగ్ సందర్శించారు. ఆమేరకు డీఐజీకి పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ మొక్కను బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం శాంతిభద్రతలు, నేరాలపై ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో డీఐజీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ రష్మి పెరుమాళ్ జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణ, కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న ప్రత్యేక చొరవలు, వినూత్న కార్యక్రమాలపై డీఐజీ కి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ... సీసీటీఎన్ఎస్ అప్‌ గ్రేడేషన్, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల సమీక్ష వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ డీపీఎస్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజల్లో, యువతలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. షీ టీమ్స్ పనితీరుపై మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేలా విజిబుల్ పోలీసింగ్‌ ను నిరంతరం కొనసాగించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌ హెచ్‌ ఓ లు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని అదేశించారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతున్న మన పోలీస్ మన ఊరు, సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమాలను డీఐజీ అభినందించారు. ఈ స్ఫూర్తితోనే కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలీసు కన్వెన్షన్ సెంటర్ ను డీఐజీ సందర్శించారు. ఈకార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ (అడ్మీన్) కుశాల్కర్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story