సూపరింటెండెంట్ కు నచ్చకపోతే... సెలవుపై వెళ్లాలా?

by Disha Web Desk 1 |
సూపరింటెండెంట్ కు నచ్చకపోతే... సెలవుపై వెళ్లాలా?
X

ఆర్థొపెడిక్ వైద్యుడు జగదీష్ మెమోపై ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు జగదీష్ పై ఫిర్యాదు వచ్చిన వెంటనే సెలవుపై వెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెట్ ఆదేశాలు ఇవ్వడంపై అధికార పార్టీ కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సూపరింటెండ్ కు నచ్చకపోతే సెలవుపై వెళ్లాలా.. అంటూ మెదక్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెడెంట్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న వైద్యుడు జగదీష్ ను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. మెదక్ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న అర్థోపెడిక్ వైద్యుడు జగదీష్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మామిడ్ల ఆంజనేయులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. అక్కడే ఉన్న సూపరింటెండెట్ చంద్రశేఖర్ ను విచారణ చేపట్టి మెమో ఇవ్వాలని సూచించారు.

కానీ, మెమోతో సరి పెట్టకుండా ఆసుపత్రి సూపరింటెండెంట్ అత్యుత్సాహంతో ఏకంగా దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లాలని హుకూం జారీ చేశారు. దీంతో చేసేదేమి లేక సదరు వైద్యుడు జగదీష్ సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికార పార్టీ కౌన్సిలర్లు వైద్యుడు జగదీష్ చేస్తున్న సేవలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సదరు వైద్యుడు విధుల్లోకి చేరిన తర్వాత దాదాపు 500 సర్జరీలు చేసినట్లు వివరించారు.

93 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ కు సైతం సర్జరీ చేశాడని, ప్రజలకు సేవా చేయాలన్న మంచి దృక్పథం ఉన్న వైద్యుడిని ఇక్కడి నుంచి పంపించేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఎమ్మెల్యే కు తెలియజేశారు. ఎక్కడైనా పేషెంట్లు ఫిర్యాదు చేస్తే స్పందించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో తక్షణమే స్పందించి వెళ్ళిపొమ్మనే వరకు వచ్చిందంటే డాక్టర్ జగదీష్ వల్ల ఎవరికో నష్టం కలుగుతుంది కాబట్టే ఫిర్యాదు చేసినట్లు అర్థం అవుతుందని కౌన్సిలర్లు ఆరోపించారు.

గతంలో పేషెంట్లు ఆందోళన చేసినా స్పందన లేదు..

మెదక్ ప్రభుత్వాసుపత్రిలో గతంలో గర్భిణులు స్కానింగ్ చేసే వైద్యుడు రావడం లేదని ఆసుపత్రిలో బైఠాయించి ఆందోళన చేసిన కనీస మెమో కూడా ఇవ్వని సూపరింటెండెంట్ అతడు లేకపోతే స్కానింగ్ చేసే వారు లేరని, ఏదో బతిమిలాడి స్కానింగ్ చేయిస్తున్నట్లు విన్నవించారు. మరి ప్రస్తుతం ఉన్న ఆర్థోపెడిక్ సెలవుపై వెళితే సర్జరీ చేసే వారు ఉండరని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేట్ ఆసుపత్రి కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుదన్నారు. ఇంతకు ముందు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని వారు.. ప్రతిపక్ష నాయకుడు ఫిర్యాదు చేస్తే.. సూపరింటెండెంట్ తక్షణం స్పందించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైద్యుడు జగదీష్ నే కొనసాగించాలి.. ఎమ్మెల్యే

వైద్యుడు జగదీష్ పై ఇప్పటి వరకు పేషెంట్ల నుంచి ఫిర్యాదులు రాలేవని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు చేసే చేసే ఫిర్యాదులపై విచారణ జరపకుండా సెలవుపై వెల్లాని ఎలా అదేశిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు నచ్చకుంటే సెలవు పై వెళ్లాలని చెబుతావా.. అంటూ సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కానీ, మంచి పనులు చేస్తున్న వారిపై కాదన్నారు.



Next Story

Most Viewed