అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం : ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్

by Disha Web Desk 1 |
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం : ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్
X

దిశ, హుస్నాబాద్ : ఓ వైపు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే మరో వైపు అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపో ప్రక్కన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... ఒకప్పుడు కరువుతో విలవిలలాడి అభివృద్ధిలో వెనుకబడిన హుస్నాబాద్ ను రూ.27.51కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

శనిగరం ప్రాజెక్టుకు రూ.22 కోట్లు, సింగరాయ ప్రాజెక్టుకు రూ.5 కోట్లు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మిడ్ మానేరు ఎడమ కాలువ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు 27 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. కాకతీయ కాలువ ద్వారా దేవాదుల నుంచి భీమదేవరపల్లి, ఎలుకతుర్తి మండలాల్లో 10వేల ఎకరాలు సాగు అవుతోందన్నారు. గౌరవెల్లి నిర్వాసితుల సహకారంతో ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయని త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది అడ్డు పుల్లలు వేసి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారని, అది కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా నియోజకవర్గంలోని 161 గ్రామాలు హుస్నాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని ఒకప్పటిలా త్రాగునీటి కటకట ఇప్పుడు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కోహెడ సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి, పన్యాల భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story