కోవిడ్ వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ హోమ్ ఐసోలేషన్ కిట్: కలెక్టర్

by Web Desk |
కోవిడ్ వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ హోమ్ ఐసోలేషన్ కిట్: కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ హోమ్ అసోసియేషన్ కిట్లు ఇవ్వాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను ఈ నెల 22 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, మెప్మా, అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటింటి ఫీవర్ సర్వే పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీంలతో గురువారం సాయంత్రం నుండి ఇంటింటి సర్వే ప్రారంభమైందని, రెండు రోజులలోగా జ్వరం సర్వే పూర్తి కావాలన్నారు.

సర్వే సజావుగా జరిగేలా, రోజు వారి నివేదిక అందించేందుకు ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారినీ నియమించాలని సూచించారు. సర్వే టీం లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని సూచించారు. ఐసోలేషన్ కిట్ తీసుకున్న వారు ఐదు రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లైతే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వైద్యాధికారులకు ఆదేశించారు. సర్వే బృందం తమ వెంట వాక్సినేషన్ డోస్ లు తీసుకెళ్ళి వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. 15-17 సంవత్సరాల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, అదేవిధంగా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనట్లైతే వెంటనే ముందస్తుగా తెప్పించి నిల్వ పెట్టాలని సూచించారు. జిల్లాలో మూడు కోవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్ట పోవద్దన్నారు.

ఎంతమందికైనా అన్ని వసతులతో కూడిన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల ఎక్విప్మెంట్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఈ విషయమై ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ ,అనుబంధ శాఖలు పూర్తి సమన్వయ సహకారాలతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఎం అండ్ హెచ్ ఓ డా. గాయత్రి దేవి, డి పి ఓ సురేష్ మోహన్, డి ఐ ఓ డా. శశాంక్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సి డి పి వో లు, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed