ప్రమాదంగా ఉందని.. తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు!?

by Jakkula.Mamatha |

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామం లాలుతాండలో విషాద ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంగా ఉందని.. తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు!?
X

దిశ, నర్సాపూర్: విద్యుత్ వైరు ప్రమాదకరంగా కింద పడి ఉందని తీయబోయే సమయంలో షాక్ తగిలి ఓ రైతు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామం లాలుతాండలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లాలుతండాకు చెందిన దేవసోత్ శంకర్(41) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం తనకున్న బర్రెలు మేపడానికి ఇంటి పక్కనే గల పొలంలోకి వెళ్ళాడు. తన పొలం పక్కనే గల పాండు అనే రైతు పొలంలో బోరు మోటర్ కోసం తీసుకున్న సర్వీస్ వైరు కింద వేలాడడం శంకర్ గమనించాడు. ఆ విద్యుత్ వైర్ వల్ల ఇతరులకు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని దానిని పక్కకు తీయబోయే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో వైరు తేలి ఉండడంతో శంకర్ విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. అదే తండాకు చెందిన రెడ్యా అనే వ్యక్తి శంకర్‌ను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే శంకర్ ను నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు. సర్వీస్ వైర్ ను పక్కకు తొలగించే ప్రయత్నంలో తన భర్తకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని తన భర్త మరణం పట్ల ఎవరిపైన అనుమానం లేదని మృతుడి భార్య చంది ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లల సంతానం కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ మార్చురికి తరలించారు.

Next Story