హరీష్ రావు రెండో కన్ను ఎటుపోయింది : ఎమ్మెల్యే

by Disha Web Desk 22 |
హరీష్ రావు రెండో కన్ను ఎటుపోయింది : ఎమ్మెల్యే
X

దిశ, దుబ్బాక: దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళిత, బీసీ బంధు ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం దళిత, బీసీ బంధు ఇచ్చినోళ్లనే ఓట్లు అడగాలని, సంక్షేమ పథకాలు రానోళ్ల ఓట్లను తామే అడుగుతామని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సవాల్ విసిరారు. మంగళవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్, అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె, చేగుంట మండలం గొల్లపల్లి, జైతారం తండా, రాంపూర్, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బీసీ, దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, అసలైన నిరుపేద కుటుంబాలకు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా అధికారంలో ఉండి దుబ్బాక నియోజకవర్గాన్ని ఎందులో అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేసి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట ఒక కన్ను దుబ్బాక ఒక కన్ను చెప్పుకునే ఆర్థిక మంత్రి హరీష్ రావు దుబ్బాక నిధులన్నీ సిద్దిపేటకు తరలించి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు పని నిమిత్తం మంత్రి వద్దకు వెళ్తే మీకు పని చేయనని చెప్పే మంత్రిని ఎక్కడ చూడలేదన్నారు. రెండు సార్లు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి దుబ్బాకలో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ శంకుస్థాపన చేసి మధ్యలోనే వదిలేసిన వంద పడకల ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేకపోయారో, పూర్తయిన డబుల్ బెడ్ రూమ్‌ను పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంగా ఎందుకు చేయలేదో, గ్రామాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లను ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్ కట్ అవుతాయని చెప్పే రాష్ట్ర మంత్రులు గడిచిన మూడేళ్లలో ఎవరికైనా పెన్షన్లు కట్ అయ్యాయా అని ప్రజలు గమనించాలని కోరారు. కొలువులు, కోపన్లు ఇవ్వలేని ప్రభుత్వం మనకు అవసరమా అన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వజనిగ ఓటు హక్కును కుల, మత, వర్గ బేధాల్లేకుండా బెదిరింపులకు భయపడకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన క్వింటాల్ వరి పంటకు రూ. 100 చెల్లించడం జరుగుతుందని, రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజులకు మూడు సీట్లను కేటాయించిందని తెలిపారు. ముదిరాజులిచ్చిన ధైర్యంతోనే ఈటల రాజేందర్‌ను గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై బీజేపీ పోటీ చేయిస్తుందని పేర్కొన్నారు. కమలం పువ్వుకు ఓటేసి గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. పదేండ్లుగా ఊర్లకు రాని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటేద్దామా, మూడేళ్లుగా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న రఘునందన్ రావుకు ఓటేద్దామా అన్నారు. నియోజకవర్గంలో అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయిస్తే ఆర్డీవో స్థాయిలో విచారణ జరిపించి అర్హులకు మాత్రమే కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Next Story