నారాయణఖేడ్ లో యథేశ్చగా గుట్కా దందా

by Dishafeatures2 |
నారాయణఖేడ్ లో యథేశ్చగా గుట్కా దందా
X

దిశ, నారాయణఖేడ్: నిషేధిత గుట్కా విక్రాయాలపై అధికారుల నిఘా కరువైంది. నారాయణఖేడ్ లో గల్లి గల్లి లో గుట్కా వ్యాపారం 'మూడు పువ్వులు ఆరు కాయలు'గా వర్ధిల్లుతోంది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అర్ధరాత్రి వేళల్లో గుట్కా ప్యాకెట్లను తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి వ్యాపారులు బహిరంగంగా గుట్కాలు విక్రయిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. జిల్లాలోని ప్రతి కిరణం షాపు, పాన్ షాపుల్లోనూ నిషేధిత గుట్కా అంబర్ పాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు కను సన్నల్లోనే దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.

జోరుగా అమ్మకాలు

జిల్లాలలోని ప్రధాన పట్టణాలైన నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతాల్లో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది. దీంతో పాటు గ్రామాలలోని వివిధ కిరాణా దుకాణంలో అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొందరు బడా వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసి రాత్రి వేళలో తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారానికి ఒకసారి ద్విచక్ర వాహనాలపై కిరాణా షాపులకు సరఫరా చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.


చిరు వ్యాపారాలపైనే చర్యలు

గుట్కా అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు జరుపుతున్న దాడుల్లో చిరు వ్యాపారులు మాత్రమే పట్టుబడుతున్నారు. బడా వ్యాపారులపై ఎందుకు దాడులు జరగడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పోలీసులు పాన్ షాపులు, కిరాణా షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసుకున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు.


మత్తులో జోగుతున్న యువత

నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయాలు జోరుగా సాగుతుండటంతో యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గుట్కా ప్యాకెట్లు తింటూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పోలీసు యంత్రాంగం అడపదడపా నిషేధిత గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించి చేతులు దులుపుకోవడంతో గుట్కా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు నిషేధిత గుట్కా పాకెట్ల విక్రయాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సరఫరా

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లు వాహనాల ద్వారా సమీప గ్రామాలకు తరలించి భారీ ఎత్తున నిలువ చేస్తున్నారని సమాచారం. 2020 సంవత్సరంలో మొర్గి చెక్ పోస్ట్ సమీపంలో గుట్కా ప్యాకెట్లతో వెళ్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. కంగ్టి నుంచి కామారెడ్డికి తరలిస్తున్న గుట్కా డబ్బులు ప్యాక్ చేసి తుఫాన్ లో తరలిస్తుండగా కంగ్టి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిజాంబాద్ కు తరలిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేయడంతో గుట్కా ఉండడంతో కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. నిషేధిత గుట్కా వ్యాపారంపై పోలీసుల చూపు కరువవడంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీంతో జోరుగా విక్రయాలు జరిపి వ్యాపారులు లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ తతంగం కొన్నేళ్ల నుంచి సాగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.



Next Story

Most Viewed