రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ: మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 1 |
రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ: మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట అర్బన్: ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని, నూకలు బుక్కమని రాష్ట్ర ప్రజలను అవహేళన చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో శనివారం సాయంత్రం జిల్లాలోనే మొదటి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

రైతు శ్రేయస్సు ప్రధాన ధ్యేయమని సీఎం కేసీఆర్ ముందుకొచ్చి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ రోజు ధాన్యం ఆ రోజు కొనుగోలు చేయాలని, లారీల ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పౌర సరఫరాల అధికారులను, తహసీల్దారును మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన రెండు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇది వరకే చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు.

అసంపూర్తిగా మిగిలిన గ్రామాభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించుకుందామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి చెందిన పెంబర్తి మాధవికి రూ.5 లక్షల రైతు భీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లవ్వ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, రైతు సమన్వ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కనకయ్య, తదితరులు పాల్గొన్నారు


Next Story