లింగబలిజలను ఓబీసీలో చేర్చాలి : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
లింగబలిజలను ఓబీసీలో చేర్చాలి : మంత్రి హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి : లింగబలిజలను ఓబీసీలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపితే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని కాశీపూర్ గ్రామంలో బసవేశ్వర భవన నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ లింగ బలిజలను ఓబీసీలో కలిపాలని డిమాండ్ చేశారు.

ఓబీసీలో కలపాలని అసెంబ్లీలో తీర్మాణం చేస్తే బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం లింగ బలిజలను ఓబీసీలో కలిపేందుకు బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. లింగ బలిజల అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. లింగ బలిజలకు హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రూ.30 కోట్ల విలువగల భూమిని కేటాయించామన్నారు. ఆ భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు.

బసవేశ్వరుని మార్గం ఆచరనీయం..

మహాత్మా బసవేశ్వరుని మార్గం ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి సూచించారు. 12వ శతాబ్దంలోనే కుల, మత, మహిళా వివక్ష, సామాజిక అసమానతల కోసం పోరాటం చేసిన మహానీయుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. ఆయన కాయకమే కైలాసం అనే సూత్రాన్ని ప్రతి ఇక్కరికి భోదించారని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఫలితాన్ని సాధించాలని సూచించారన్నారు. దైవ సమానుడైన విశ్వేశ్వరుడి బాటను ఆచరించాలని సూచించారు.

అభివృద్ధి చేస్తున్న సీఎంను దించుతారంటా..

సీఎం కేసీఆర్ దించుతామని కాంగ్రెస్ నాయకులు విచిత్రమైన వాదన చేస్తున్నారని, అసలు ఎందుకోసం కేసీఆర్ ను దింపుతారని సూటిగా ప్రశ్నించారు.ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకా ..? కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకా..? కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకా..? రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా..? రైతుబీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకా..? దించుతారా..? కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకా..? ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా..టీహాబ్,వీహాబ్,టీఎస్ఐపాస్ తో పదిహేడు లక్షల ప్రైవేటు కోలువులు ఇస్తున్నందుకు దించుతరా..? అని హరీష్ రావు ప్రశ్నించారు.

రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తుంది మీరు కాదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంతో మారింది, న్యూయార్క్ లాగా ఉంది అని సూపర్ స్టార్ రజనీకాంత్ సీఎం కేసీఆర్ పాలనను ఎంతో మొచ్చుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్ కు అర్థం అయ్యింది కానీ ఇక్కడి గజనీలకు మాత్రం అర్థం కావడం లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ , చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్,టీఎస్ ఎం ఎస్ ఐడీసీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ నగేష్, తహసీల్దార్ విజయలక్ష్మీ, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాది మదుశేఖర్, మఠం బిక్షపతి, ఆత్మకూర్ నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, కంది ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ విమల వీరేశం, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story