క్రికెట్ స్టేడియం కోసం క్రీడాకారుల ఎదురుచూపులు

by Dishanational2 |
క్రికెట్ స్టేడియం కోసం క్రీడాకారుల ఎదురుచూపులు
X

దిశ , మనోహరాబాద్ : కొన్నేళ్ల నుండి కలగా మారిన క్రికెట్ స్టేడియం కోసం క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చి క్రీడాకారుల కోరికలను తీర్చాలని క్రీడాకారులు మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తులు చేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న మిగులు స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టి క్రీడాకారుల ఇబ్బందులను తొలగించాలని మండల క్రీడాకారులు కోరుతున్నారు. ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో టిఎస్ఐఐసి అధికారులు 2008లో దాదాపు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటినుండి ఇప్పటివరకు మండల వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పలు క్రీడలను ఆడుతున్నారు.

ఈ తరుణంలో గత ఏడాది ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ గ్రామ సర్పంచ్ నరాల ప్రభావతి డాక్టర్ పెంటయ్య ల ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మండలం తో పాటు ఇతర మండలాలు చెందిన క్రికెట్ క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి లతో పాటు మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎంపీపీ పురం నవనీత రవికుమార్ ముదిరాజ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం కన్వీనర్ చిట్కుల మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో కలిసి మంత్రి హరీష్ రావు పోటీలను ప్రారంభించి వారితో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు.

గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి బహుమతులను ప్రధానం చేశారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిదులు, నాయకులు ఈ స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించి క్రీడాకారుల ఇబ్బందులను తొలగించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి టీఎస్ఐఐసీ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పూర్తవుతున్న స్టేడియం నిర్మాణం కలగా మారడంతో క్రీడాకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తమ ఇబ్బందులను తొలగించాలని మరోమారు మంత్రి హరీష్ రావును క్రీడాకారులు కోరుతున్నారు.


Next Story

Most Viewed