ఆరోపణలు రుజువు చేస్తావా..​ముక్కు నేలకు రాస్తావా.. అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్

by Web Desk |
ఆరోపణలు రుజువు చేస్తావా..​ముక్కు నేలకు రాస్తావా.. అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. చేసిన ఆరోపణలు రుజువు చేస్తారా..? లేదంటే ముక్కు నేలకు రాస్తావా..? అని స్టేట్​ మెడికల్ సర్వీసెస్​అండ్ ​ఇన్ఫ్రాస్ట్రక్చర్ ​డెవలప్మెంట్ ​కార్పొరేషన్ చైర్మన్ ​ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్​అబద్దాలకు బ్రాండ్​అంబాసిడర్‌గా మారిపోయారని ఎర్రోళ్ల ఆరోపించారు. ఆరోగ్యశాఖ టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం టెండర్లు జరుగుతాయని ఆయనకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జెమ్ టెండర్ల విషయంలో రెండు కోట్లు ఎవరి ఇంట్లోకి వెళ్లాయని ప్రభాకర్​ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నిరూపిస్తారా..? అని ప్రశ్నించారు. రెండు ఏజన్సీల మధ్య నెలకొన్న పంచాయతీ ప్రభుత్వానికి, వైద్య శాఖకు అంటగట్టడం ఏమిటని శ్రీనివాస్​ ప్రశ్నించారు.

ఈ టెండర్లకు వైద్య ఆరోగ్యశాఖ కు, మంత్రి హరీష్​రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు పూర్తిగా అబద్దాలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ టెండర్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నదని.. న్యాయస్థానం ఆదేశాల మేరకు పని చేస్తామని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్న ప్రభాకర్ వాటిని రుజువు చేయాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ ​డిమాండ్​ చేశారు. లేదంటే ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నదని. ఏది దాచాల్సిన అవసరం లేదన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేయడంతో మీ పరిస్థితి అర్థం అవుతుందని శ్రీనివాస్ బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Next Story