తిరుపతి తరహాలో యాదాద్రి అభివృద్ది.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Disha Web Desk 20 |
తిరుపతి తరహాలో యాదాద్రి అభివృద్ది.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి/ పాపన్న పేట : తిరుపతి తరహాలో తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత సుందరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి, ఆజంపుర మసీదులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ , రమేష్ తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమత ప్రార్థనలు చేసి యావత్ తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకొని విజయం సాధించారన్నారు.

రాష్ట్రంలో ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక చింతనతో అమ్మవారి సేవలో ఉండాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి వెలుగొందుతుందని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక దేవాలయం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణ బద్ధులై హైదరాబాద్ కు దగ్గరలో యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దారన్నారు. ఆధ్యాత్మిక చింతనతో అత్యంత సుందరంగా చూడగానే చేతులెత్తి మొక్కే విధంగా ఆలయం నిర్మించారన్నారు. రాష్ట్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు జరిపారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని, ఏసుప్రభు దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోవడం జరిగిందన్నారు.

9 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి సుస్థిరమైన పరిపాలన అందిస్తూ వస్తున్నారని అన్నారు. క్రిస్మస్, దసర, రంజాన్ ఇలా అన్ని వర్గాల పండుగలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మెదక్ సిఎస్ఐ చర్చ్ గౌరవాన్ని పెంపొందించే విధంగ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వపరంగా దేవాలయం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మానవసేవే మాధవసేవ అన్నట్లు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. ఏసుప్రభు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరారు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. అనంతరం ఆజంపురలోని మసీదుకు వెళ్లి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి జెంల నాయక్, బి.సి.అభివృద్ధి అధికారి శంకర్, ఆర్.డి.ఓ.సాయి రామ్, పలువురు ప్రజాప్రతినిధులు, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Next Story