జనసంద్రమైన జనహిత పాదయాత్ర

by Yella Dhawani Reddy |

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన జనహిత పాదయాత్ర శుక్రవారం సాయంత్రం అందోలు నియోజకవర్గంలో ప్రారంభమైంది.

జనసంద్రమైన జనహిత పాదయాత్ర
X

దిశ, అందోల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన జనహిత పాదయాత్ర శుక్రవారం సాయంత్రం అందోలు నియోజకవర్గంలో ప్రారంభమైంది. పాదయాత్రకు విచ్చేస్తున్న మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌లను సంగుపేట చౌరస్తా వద్ద వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. సంగుపేట వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయగా, పార్టీ నాయకులు జాతీయ గేయాన్ని అలపించి, జనహిత పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జన సందోహం మధ్య జై కాంగ్రెస్‌.. జై జై కాంగ్రెస్‌.. జై సోనియా గాంధీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు, హైడ్రోజన్‌ బెలూన్‌ లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చేపడుతున్న పథకాలను వివరిస్తున్న డీజే పాటలు అలరించాయి. పాదయాత్రలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షేట్కార్, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, రాజనర్సింహ పౌండేషన్‌ చైర్మన్‌ త్రిష రాజనర్సింహ, సీనియర్‌ నాయకులు గాలి అనిల్‌కుమార్, విజయారెడ్డి, చిట్టి దేవేందర్‌రెడ్డి, ఇందిరా శోభన్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్​, మార్క్‌ఫెడ్​ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎఎంసీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ రాములు, డేవిడ్, మాజీ కౌన్సిలర్లు ఎస్‌.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, ఎ.చిట్టిబాబు, ప్రవీణ్, డాకూరి శంకర్, నాని నాగరాజ్, దుర్గేష్, చందర్, లక్ష్మణ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

అడుగడుగునా అభివాదంతో ముందుకు:

జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అడుగడుగునా ఆమెకు నీరాజనం పలకడంతో ఆమె కూడా వారిలో అప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. పాదయాత్రను చూసేందుకు వచ్చిన అందోలు వద్దనున్న పాలిటెక్నిక్‌ విద్యార్థినులను పలకరించి విద్యాభ్యాసం గూర్చి, ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అందోలు చౌరస్తాపై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి, జోగిపేటలోని బస్వవేశ్వరుడి విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి, పాదయాత్రను జోగిపేటలోని పార్టీ కార్యాలయం వరకు కొనసాగించారు.

దారంతా జనసందోహమే:

మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన జనహిత పాదయాత్రకు ప్రజలను విశేష స్పందన వచ్చింది. అంచనాలకు మించిన జనాలు వేలాదిగా తరలి రావడంతో సంగుపేట నుంచి జోగిపేట వరకు ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. జనహిత పాదయాత్ర మరో జోడో యాత్రను తలపించేలా ఉందంటూ ఈ యాత్రకు వచ్చిన వారు చర్చించుకోవడం కనిపించింది. పాదయాత్రకు వచ్చిన వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చాలా వరకు శ్రమపడాల్సి వచ్చింది. ప్రముఖుల చుట్టూ తాళ్లతో రౌండప్‌ చేసి కట్టడి చేసే ప్రయత్నాలు చేశారు.

Next Story