రోడ్డుపై నాట్లు వేస్తూ నిరసన

by Dishanational1 |
రోడ్డుపై నాట్లు వేస్తూ నిరసన
X

దిశ, దుబ్బాక: దుబ్బాక మండల కేంద్రం నుండి లచ్చపేట వెళ్ళే రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెరువు కట్ట నుండి నీళ్లు అధికంగా లీకేజీ కావడంతో రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక నుండి లచ్చపేట వేళ్లే రోడ్డుకు వీలైన తొందరగా మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వరి నాట్లు వేస్తూ నిరసన చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతూ పెద్ద చెరువుకట్ట మరమ్మతు చేయడంలో కాంట్రాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ కారణంగా లీకేజీ అవుతుందని విమర్శించారు. కట్ట మరమ్మత్తులు చేయకముందు ఒక చుక్క నీరు కూడా కట్టనుండి బయటకు వచ్చేది కాదని, మరమ్మత్తులు చేసినప్పటి నుండే నీరు బయటకు రావడం జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టర్లు తమ కమీషన్ల కొరకు మాత్రమే ఆలోచించడం కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, వారిపై అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సరైందికాదని అన్నారు.

కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా అనేకమందికి ప్రమాదాలు జరిగి కాళ్ళు, చేతులు విరిగాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా కాంట్రాక్టర్ల కొరకు అధికారులు పనిచేయడం మానుకోవాలని హెచ్చరించారు. చెరువు కట్ట మరమ్మతు చేసిన కాంట్రాక్టు లైసెన్స్ ను వెంటనే రద్దుచేసి కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి చెరువు కట్ట లీకేజీ కాకుండా మరమ్మతులు చేసి రోడ్డును కూడా బాగు చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ దుబ్బాక మండల కమిటీ సభ్యులు ఎండీ సాదిక్, కొంపల్లి భాస్కర్, నాయకులు ప్రశాంత్, చందు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed