సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుంది: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

by Disha Web Desk 1 |
సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుంది: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
X

దిశ, ఇబ్రహీంపట్నం: సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు.. సీపీఐ ప్రజల వద్దకు సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆ పార్టీ నాయకులు సోమవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై నల్ల చట్టాలను ప్రయోగించి అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పది రెట్లు పెంచి పేద వాళ్ల నడ్డి విరిచిందన్నారు.

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల పై భారం మోపడమే కాకుండా, అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. పేద ప్రజల కోసం ఏ ఒక్క మంచి పని చేసారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, గిరిజనులకు పోడు భూముల పంపిణీ తో పాటు తదితర విషయాలు గాలికి వదిలేశారని విమర్శించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ ఉనికి కోసం పాకులాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సీపీఐ కార్యదర్శులు సురేష్, పవన్, వెంకటస్వామి, వేణు, సదానందం, ఏ.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ రెడ్డి, మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాళ్లు లక్ష్మి, మల్లక్క, పద్మ, సీపీఐ పార్టీ మాజీ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ నాయకులు హుస్సేన్, ఎండీ.ముక్రం, చైతన్య బృందం కళాకారులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story