అక్రమ అరెస్టులతో వాస్తవాలను దాచలేరు..!

by Disha Web Desk 20 |
అక్రమ అరెస్టులతో వాస్తవాలను దాచలేరు..!
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అక్రమ అరెస్టులతో వాస్తవాలను దాచలేరని పీసీసీ సభ్యులు పూజల హరికృష్ణ, దరిపల్లి చంద్రం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. మంత్రులు తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు సిద్దిపేట పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య చోటు చేసుకున్న తోపులాటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి గాయమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు.

ఉద్యోగ కల్పనలో విఫలమైన బీఆర్ఎస్ నాయకులు ఏ మొఖం పెట్టుకొని పర్యటిస్తారని సూటిగా ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల దురుసు ప్రవర్తన పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో పాటుగా, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మజార్ మాలిక్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పూజల గోపి, పట్టణ యువజన అధ్యక్షుడు గయాజుద్దీన్, నాయకులు అరివింద్, బబ్బు తదితరులున్నారు.

Next Story

Most Viewed