కాంగ్రెస్ దీ ఓటు బ్యాంకు రాజకీయం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ దీ ఓటు బ్యాంకు రాజకీయం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గిరిజనులను ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ దీ అని, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ దీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడటంతో పాటుగా నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలను అందజేయనున్నట్లు స్ఫష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి వేడుకల్లో మంత్రి హరీష్ రావు పొల్గొని సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. స్వరాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటుగా గిరిజన రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గిరిజన తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మద్యం షాపుల లైసెన్సు కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందన్నారు.

1287 తండాలకు 2500 కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మాణానికి 1385 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 183 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి 75,410 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర రాజధానిలో అదివాసీ, బంజారాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కుంభమేళాగా భావిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర, నాగోబా, బౌరంపూర్, జంగూబాయి, నాంచారమ్మ తదితర జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

దళిత్ జర్నలిస్ట్ సోసైటీ ఆధ్వర్యంలో..

దళిత్ జర్నలిస్ట్ సోసైటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు మంత్రి హరీష్ రావు బహుమతులు అందజేశారు. విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులతో కాసేపు ముఖాముఖి నిర్వహించారు.రాజ్యాంగ, సిద్దిపేట పట్టణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పట్టణంలో కెమిస్ట్ భవన్ నిర్మాణానికి, కార్మిక సంఘ భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మున్సిపాల్ చైర్ పర్సన్ మంజులా రాజనర్సు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed