మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

by Disha Web Desk 1 |
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్‌చెరు: తనపై నమ్మకంతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నీలం మధు ముదిరాజ్ పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరి సహకారంతో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానానికి తనను ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంత రావు ఆశీస్సులతో పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులకు నీలం మధు ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి దామోదరకు రుణపడి ఉంటా..

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఖరారు కావడంలో మంత్రి దామోదర రాజనర్సింహ సహకారాన్ని మరువలేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తనను మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సహకరించినందుకు రుణపడి ఉంటానని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సలహాలు, సూచనల మేరకు ఆయన అడుగుజాడల్లో అందరినీ కలుపుకుని ముందుకెళ్లి మెదక్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Next Story