'మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం'

by Disha Web Desk 13 |
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మల్లన్న సాగర్ నిర్వాసితులకు అందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ, నష్టపరిహారం, ఓపెన్ ప్లాట్లు, ఆర్అండ్ఆర్ కాలనిలో మౌలిక వసతులు కల్పన తదితర అంశాల పై బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్యాకేజీ-నష్ట పరిహారాలను త్వరలో అందించాలని మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారన్నారు. ఓపేన్ ప్లాట్‌లకు సంబంధించి లేఅవుట్‌లను త్వరగా పూర్తయ్యేలా ఆర్డీవో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

నిర్మాణ ఎజెన్సీలు పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు. లేఅవుట్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో విద్యుత్ సంబంధించిన పోల్స్, వైరింగ్, లైట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ప్రభాకర్ కి సూచించారు. కాలనిలో మిషన్ భగీరథ కు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎస్ ఈ శ్రీనివాస్ చారి కి తెలిపారు. మౌలిక వసతులు కల్పనలో భాగంగా గుడి, బడి, డ్రైనేజీ, హెల్త్ సెంటర్లు ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్ట్రీట్ లైట్లు ఇతర చిన్న చిన్న పనులకు గ్రామ పంచాయతీ నిధుల నుండి వాడుకోవాలని సర్పంచ్‌లకి సూచించారు. యువతకి ఉపాధి కల్పనలో భాగంగా ఎల్అండ్‌టీ ద్వారా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓ లు అనంతరెడ్డి, విజేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed