మొరాయిస్తున్న మీసేవ సర్వర్..

by Disha Web Desk 20 |
మొరాయిస్తున్న మీసేవ సర్వర్..
X

దిశ, దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం ఎందరికందుతుందో ఏమో కానీ ఇప్పుడైతే దరఖాస్తుదారుల జేబు నుంచి సర్టిఫికెట్లు, జిరాక్సుల కోసం చేతిచమురు వదులుతోంది. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాలనే ఆలోచనతో ఉన్న వారి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ వసూళ్లకు దిగుతున్నట్లు సమాచారం. చేతి, కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీలలోని 15 కులాలకు తొలివిడతలో అవకాశం కల్పించింది. ఆయా కులాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహసీల్దార్‌ ఆఫీసుల ఎదుట బారులుదీరుతున్నారు.

కిటకిటలాడుతున్న మీ సేవ కేంద్రాలు..

ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.లక్ష సాయం పథకం కింద ముందుగా దరఖాస్తు చేసుకుంటే మనకే వస్తుందంటూ కొందరు ప్రచారం చేయడంతో ఆశావహులంతా ఒక్కసారిగా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో రెండురోజులుగా మీసేవ కేంద్రాలన్నీ కిటకిటలాడాయి.

కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు..

మీసేవ కేంద్రాల్లో నమోదు చేసిన దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయానికి కుప్పలు, తెప్పలుగా చేరుతున్నాయి. దౌల్తాబాద్ మండలం 1350 టు 1500 వరకు దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌ ఆఫీసుకు చేరిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రూ.45 కు బదులు రూ.100వసూలు..

పల్లె ప్రాంతాల నుంచి వస్తున్న నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు ఒక్కో సర్టిఫికెట్‌ నమోదుకు రూ.45 తీసుకోవాల్సి ఉండగా.. రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పాత సర్టిఫికెట్‌ లేని వారి నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలోనే తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్వాహకులు అడిగినంత ఇవ్వకపోతే సర్టిఫికెట్‌ సకాలంలో రాదన్న భయంతో అడిగినంత చెల్లించుకుంటున్నట్లు తెలిసింది.

ఈ నెల 20 ఆఖరు తేదీ..

రూ.లక్ష సాయం పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రకటించిన 15 కులాలకు తొలివిడతలో అవకాశం కల్పించింది. దరఖాస్తులను సమర్పించేందుకు ఈ నెల 20 తేదీ ఆఖరు గడువుగా ప్రకటించింది. అందులో సగర ఉప్పర, నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి శాలివాహన, అవుసుల, కంసాలి, వడ్రంగి శిల్పులు, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణబలిజపూస, మేర టైలర్స్‌, ఆరె కటిక, ఎంబీసీ కులాల వారికి తొలివిడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

సర్టిఫికెట్లను అందిస్తాం..

మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకున్నామని దౌల్తాబాద్ తహసీల్దార్ దండి సుజాత తెలిపారు. సోమవారం నుంచి తమ సిబ్బందికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించామన్నారు. సకాలంలోనే సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed