గొయ్యితోనే ఆగిన వంతెన పనులు

by Taduka Kalyani |

శేరిపల్లి–గుంటిపల్లి గ్రామాల మధ్య హైలెవెల్ వంతెన నిర్మాణం పేరుతో రోడ్డును తవ్వేసి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గొయ్యితోనే ఆగిన వంతెన పనులు
X

దిశ,వర్గల్: శేరిపల్లి–గుంటిపల్లి గ్రామాల మధ్య హైలెవెల్ వంతెన నిర్మాణం పేరుతో రోడ్డును తవ్వేసి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని అధికారులు, కాంట్రాక్టర్ హామీ ఇచ్చినా నాలుగు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఇరు గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. 2023లో పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.2.2 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ టెండర్లు పూర్తి చేసి, 2025లో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ పాత కాజ్‌వేను తొలగించి రోడ్డును లోతుగా తవ్వాడు. ప్రజల రాకపోకల కోసం పక్కనే తాత్కాలిక మట్టి దారిని ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడితోనే పనులు నిలిపివేశాడు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో తాత్కాలిక దారి కూడా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే నిర్మాణ పనులు పునఃప్రారంభించి వంతెనను పూర్తి చేయాలని శేరిపల్లి, గుంటిపల్లి గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Next Story