అందోల్ ను హెల్త్ హ‌బ్ గా తీర్చిదిద్దుతా : మంత్రి దామోద‌ర‌ రాజ‌న‌ర్సింహ

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిని సారించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ తెలిపారు.

అందోల్ ను హెల్త్ హ‌బ్ గా తీర్చిదిద్దుతా : మంత్రి దామోద‌ర‌ రాజ‌న‌ర్సింహ
X

దిశ, అందోల్ : రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిని సారించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ తెలిపారు. గురువారం మండ‌ల ప‌రిధిలోని డాకూర్ ధ‌ర్మ శాస్త్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌హారా ఆసుప‌త్రి హైద‌రాబాద్ వారి సౌజ‌న్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అందోల్ నియోజకవర్గాన్ని హెల్త్‌ హాబ్‌గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నానన్నారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో 150 పడకల మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధ చికిత్స లను కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా అందిస్తున్నామన్నారు.


డాకూర్‌ గ్రామానికి చెందిన ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. ప్రజలు వెన్ను, కీళ్ల నొప్పుల కోసం డాక్టరు సూచనలు లేకుండా విరివిగా పెయిన్‌ కిల్లర్‌ మందు గోళీలు వాడటం వల్ల మూత్రపిండాలలో సమస్యలు వస్తాయని మంత్రి వెల్లడించారు. డాక్టర్‌ సూచనలు లేకుండా మందు గోలిలు వాడొద్దని ఆయన సూచించారు. గ్రామ ప్రజలు వైద్య చికిత్స కోసం దగ్గరలో ఉన్న జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డి లోని జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రజలు వాటిని వినియోగించుకోవాలన్నారు. డాకూర్‌ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ముప్పారం ప్రకాశంకు క్యాన్సర్‌ చికిత్సకు సహారా అసుపత్రి వారు సకాలంలో స్పందించి మెరుగైన చికిత్సను అందించడంతోనే ప్రకాశం త్వరగా కొలుకున్నారని తెలిపారు. క్యాన్సర్‌ అని తెలిసిన వెంటనే ప్రకాశానికి విలువైన క్యాన్సర్‌ నివారణకు అవసరమైన మందులను ఉచితంగా అందించి అండగా నిలిచారని వెల్లడించారు. ఈ సందర్భంగా మెడికల్‌ క్యాంపు లో పాల్గొన్న సహారా హాస్పిటల్‌ డాక్టర్లు, సిబ్బంది కి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ వసంత్‌ కుమార్, డాకూరు గ్రామ సర్పంచ్‌ వసంత్‌రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్‌గౌడ్‌పాల్గొన్నారు.

Next Story