బస్సులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

by Disha Web Desk 12 |
బస్సులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
X

దిశ, జహీరాబాద్: కర్ణాటకలోని బీదర్ హాస్పిటల్ వెళ్తున్న నిండు గర్భిణీ బస్సులోనే ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుఖ ప్రసవానికి సమయస్ఫూర్తిని చాటిన డ్రైవర్, కండక్టర్ లు ప్రశంసలందుకోగా డిఎం. సత్యనారాయణ వారిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. జహీరాబాద్ డిపో‌కి చెందిన బస్సు బీదర్ వెళుతుండగా స్థానిక బస్ స్టేషన్ లో ఝరాసంగం మండలం పొట్టి పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా గర్భవతైన తన భార్య జరీనా బేగంతో కలిసి బస్సెక్కారు.

బీదర్ హాస్పిటల్‌కు వారు ప్రయాణమయ్యారు. జహీరాబాద్ దాటగానే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఇది గమనించిన బస్సు డ్రైవర్ ఆనందం (ఇ-238650), కండక్టర్ కరుణాకర్ (ఇ 802023)లు సమయస్ఫూర్తితో వ్యవహరించి మార్గమధ్యంలో బంగ్లా మిర్జాపూర్ ప్రభుత్వాసుపత్రికి ఆమెను తరలించారు. ఆసుపత్రి డ్యూటీ నర్స్ సుధా రాణి బస్సు వద్దకు వచ్చేలోపే బస్సులోనే సదరు మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్లు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. తల్లీ బిడ్డ లిద్దరు క్షేమంగా ఉన్నారు. ఇందుకు డ్రైవర్, కండక్టర్లు సమయస్ఫూర్తిని చాటడమే ప్రధాన కారణమని డిపో మేనేజర్ సత్యనారాయణ వారిని అభినందించారు.


Next Story