Goshalas: కమిషనర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

by Disha Web Desk 3 |
Goshalas: కమిషనర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
X

దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే కోడె మొక్కులకు ప్రసిద్ధి. కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెలకు రక్షణ కరువైందని, వాటి సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజరాజేశ్వర పుణ్య క్షేత్రానికి వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు రాజన్న దర్శనం అనంతరం గోశాలలను సందర్శించి, కోడెల సంరక్షణపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల తీరుపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మళ్ళీ ఒకసారి కోడెల ఇష్యూ వెలుగులోకి వచ్చింది.

కమిషనర్ ఆదేశాలతో..

కమిషనర్ గోశాలను పరిశీలించి వెళ్లిన రెండు రోజుల తర్వాత, పశు సంవర్ధక శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి గోశాలలోని సుమారు వెయ్యి కోడెలకు వ్యాక్సినేషన్ చేయడంతో పాటు వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న వాటికి వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు. కోడెలకు ఇలాంటి వ్యాధులు ఎందుకు వ్యాపిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు వైద్యులు క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య నివేదికను రాష్ట్ర సీఎంవోకు అందించినట్లు సమాచారం.

సీఎంవో దృష్టికి కోడెల ఇష్యూ

కమిషనర్ గోశాలను పరిశీలించిన విషయం సి.ఎం.వో దృష్టికి వెళ్లగా, విషయంపై ఆరా తీసిన సంబంధిత అధికారులు, పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి వెంటనే రాజన్న కోడెల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, కోడెలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. వారి ఆదేశాలతో రాష్ట్ర పశువర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ మంజువాణి పర్యవేక్షణలో గురువారం కోడెలకు వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించారు.

1093 కోడెలకు వైద్యం చేశాం: కొమురయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి రెండు గోశాలల్లోని 1093 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. 8మంది వైద్యులు, 15మంది సిబ్బంది, మరికొంత మంది దేవాలయ సిబ్బంది సహకారంతో కోడెలకు వైద్య పరీక్షలతో పాటు అవసరం ఉన్న కోడెలకు వ్యాక్సినేషన్, గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.

కోడెల సంరక్షణలో భాగంగా ఆలయ అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. ముఖ్యంగా కోడెల వయస్సును బట్టి వాటిని విడదీసి సంరక్షణ చేపట్టాలని సూచించడం జరిగింది. మరోవైపు కోడెల వైద్య శిబిరం పర్యవేక్షణకు వచ్చిన డైరెక్టర్ మంజువాణి గోశాల కలియదిరిగి కోడెలను, వాటి సంరక్షణ తీరును, వాటికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి దేవాలయ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ క్రమంలో కోడెలు తిరుగుతున్న ప్రదేశము పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు కోడెలకు సరిపోయేంత త్రాగునీరు అందుబాటులో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed