Maoist Party: బీసీ బంద్‍కు మావోయిస్టు పార్టీ మద్దతు.. సమస్య పక్కదారి పట్టించే ప్రయత్నాలు వద్దని ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-10-16 10:29:59  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఈ నెల 18న తలపెట్టిన బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది.

Maoist Party:  బీసీ బంద్‍కు మావోయిస్టు పార్టీ మద్దతు.. సమస్య పక్కదారి పట్టించే ప్రయత్నాలు వద్దని ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (Telangana BC reservations) సాధన కోసం బీసీ జేఏసీ (BC JAC bandh) ఈ నెల 18న తలపెట్టిన బంద్ కు మావోయిస్టు పార్టీ (Maoist Party ) మద్దతు తెలిపింది. ఈ బంద్‍ను విజయవంతం చేయాలని గురువారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ (Jagan) ప్రకటన విడుదల చేశారు. కరుడు కట్టిన మనువాద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలిసి పోరాడాలని, అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై ప్రజాందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. మనది ఫెడరల్ రాజ్యాంగం అని దీని ప్రకారం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వబడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసుకునే అధికారం ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభలో బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్, ఆ తర్వాత జీవో 9 విడుదల చేసింది. సమస్య మూలంలోకి పోయి అర్థం చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది తప్ప స్వార్థ రాజకీయాల లబ్ధి కోసం ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. ఈ సమస్యలలో న్యాయపరమైన చిక్కులను అడ్డుపెట్టి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు అడ్డుకోవాలన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా న్యాయపరంగానూ చట్టాన్ని తెచ్చేందుకు పోరాడాల్సి ఉందన్నారు. పార్లమెంట్‍లో చట్టం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుకుందని అందువల్ల అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కలిసి బలమైన ప్రజాందోళన చేపట్టడం ద్వారానే ఈ డిమాండ్ ను సాధించుకోగలుగుతామన్నారు.

అలాగే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 100 రూపాయల నాణేన్ని, పోస్టల్ స్టాంప్‍ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడంపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ చర్యతో స్వతంత్ర పోరాటంలో విద్రోహకర పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ ను అధికార పీఠం మీద అధిష్టించినట్లుగా స్పష్టమైందని ఇక రాబోయే కాలం మనువాదులకు అచ్చేదిన్ గా పీడిత ప్రజలకు దుర్దినాలుగా ఉంటుందన్నారు. ఈ స్థితిని మార్చేందుకుదేశప్రజలు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.

Next Story