మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి సేఫ్.. అగ్రనేతల మరణవార్తలపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి సేఫ్.. అగ్రనేతల మరణవార్తలపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్, సాయన్న), కట్టా రామచంద్రారెడ్డి (విజయ్, వికల్ప్) క్షేమంగా, సురక్షితంగా ఉన్నారని, వారు మరణించినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారు.

ఆ ఇద్దరు నాయకులూ పార్టీకి టచ్‌లోనే ఉన్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు లేవన్నారు. వారిద్దరి క్షేమ సమాచారం కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్న యావత్తు విప్లవ ప్రచానీకానికి, సంస్థలకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ ప్రకటన ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.

పలు తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల వెనక కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నదని పేర్కొన్నారు. “ఈ అబద్ధపు వార్తా కథనాల ద్వారా ప్రజలను అయోమయంలో ముంచెత్తాలని, విప్లవ విజయం పట్ల అవిశ్వాసం కల్గించడానికి, మా నాయకుల ఆనుపానులు తెలుసుకోడానికే ఉద్దేశపూర్వకంగా ఈ అబద్ధపు ప్రచారం” అని మంగ్లి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుల అనారోగ్యంపై ప్రభుత్వాలు తరచూ అసత్య ప్రచారాలు చేస్తున్నరని మంగ్లి ఆ ప్రకటనలో గుర్తుచేశారు. “పార్టీకి వ్యతిరేకంగా పాలకవర్గాలు చేపట్టిన మానసిక యుద్ధంలో భాగమే ఇలాంటి దుష్ప్రచారం” అని నొక్కిచెప్పిన మంగ్లి... ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Next Story