ఆ బాధ్యత కేసీఆర్​దే.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

by Disha Web Desk 16 |
ఆ బాధ్యత కేసీఆర్​దే.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్​దే బాధ్యత అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కేసీఆర్​కుటుంబం పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకోవటంతో కాంట్రాక్టర్లు దానిని నాసిరకంగా నిర్మించారని ఆరోపించింది. ఈ కారణంగానే పిల్లర్లు కుంగిపోయాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ జయశంకర్​భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యుపీ) డివిజన్​కమిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నది మీద మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని నిర్మించి 2019, జూన్​21న ప్రారంభించిన బ్రిడ్జి పిల్లర్లు ఇంత తొందరగా కుంగిపోవటానికి కారణం అవినీతేనని మావోయిస్టు పార్టీ పేర్కొంది. నిజానికి నిర్మిస్తున్న సమయంలోనే బ్రిడ్జిలో భాగమైన పిల్లర్లకు పగుళ్లు ఏర్పాడ్డాయని మావోయిస్టు పార్టీ తెలిపింది.


అయితే, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు, ప్రజా సంఘాలు, బూర్జువా పార్టీలను సైతం అక్కడికి వెళ్లనివ్వకుండా పోలీస్​బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించి ముందస్తు అరెస్టులు జరిపించిందని తెలిపింది. చివరకు మీడియాను కూడా బెదిరించారని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. తెలంగాణను దోచుకున్న ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కోసం సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి తెలంగాణను సాధించుకున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే, తెలంగాణ పాలకులు మాత్రం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీతోపాటు పలు నిర్మాణాల కాంట్రాక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించింది. ఈ కాంట్రాక్టర్లు నిర్మించిన కట్టడాలు నాసిరకంగా ఉన్నాయని, ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందని వ్యాఖ్యానించింది. లక్ష్మీ బ్యారేజీని నిర్వహించటానికి ప్రజల పంట పొలాలు, సాగు భూములను నయానా, భయానా ఇచ్చి లొంగదీసుకుని తీసుకున్నట్టుగా పేర్కొంది. నిర్వాసితులకు నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదని మావోయిస్టు పార్టీ తెలిపింది.

ఇక, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన స్థానికులకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని, పెట్టుబడిదారులు, ఫ్యాక్టరీలు, భూస్వాములకే ఇచ్చారని ఆరోపించింది. లక్ష్మీ బ్యారేజీతో కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని, తెలంగాణ సస్యశ్యామలం అయిపోయిందని గొప్పలు చెప్పుకొంటున్నారని, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని పేర్కొంది. ఎన్నికలు దగ్గర పడటంతో లక్ష రూపాయల రుణ మాఫీ చేశారని మావోయిస్టు పార్టీ తెలిపింది.



Next Story

Most Viewed