హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలి.. మావోయిస్టు నేతల పిలుపు

by Dishafeatures2 |
హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలి.. మావోయిస్టు నేతల పిలుపు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలని మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. 2047 సంవత్సరంలోపు భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తోందన్నారు. ఇదంతా సామ్రాజ్యవాదులు, దళారీ, దోపిడీ వర్గాలకు సంపదను దోచి పెట్టటానికే అన్నారు. ప్రజల మధ్య కులాలు, మతాల పేర చిచ్చు పెడుతోందని విమర్శించారు. దీనికి మణిపూర్​ హింస సజీవ సాక్ష్యమన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ర్ట సరిహద్దుల్లోని దండకారుణ్యంలో మావోయిస్టు నేతలు భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మణిపూర్​లో మైదాన ప్రాంత వాసులైన మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చి క్రిస్టియన్, హిందూ వర్గాల మధ్య మత ఘర్షణలు సృష్టించింది బీజేపీ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. భారత ప్రజలపై బలవంతంగా హిందుత్వాన్ని రుద్దుతున్న ఆర్ఎస్ఎస్​ను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దీనికోసం ప్రజాస్వామిక విప్లవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ పాలక వర్గాలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ప్రజాస్వామిక విప్లవాలు, జాతి ఉద్యమాలను నిర్మూలించటానికి విప్లవ ప్రతిఘాతుక సూరజ్​కుండ్​ వ్యూహాత్మక దాడులు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ ​చారుమజుందార్, కన్హయ్ ఛటర్జీలు చూపిన ప్రజా యుద్ధ మార్గంలో సామ్రాజ్యవాద, దళారీ, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు వదిలిన అమరులకు సెల్యూట్ ​చేశారు. ఈ సందర్భంగా అమరులైన కటకం సుదర్శన్ ఎలియాస్ ​ఆనంద్​ ఎలియాస్ ​దూల దాదాను స్మరించుకున్నారు. కటకం సుదర్శన్​ సహచరి పద్మ ఆయన సంస్మరణలో నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈనెల 2, 3వ తేదీల్లో జరిగిన సభలో ఛత్తీస్​ఘడ్, తెలంగాణ రాష్ర్టాల్లోని సరిహద్దుల్లో ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. సభలో అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed