ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీకి తమ్ముడి కూతురు లేఖ

by Ajay Maddhiboyina |

‘రాజులు, రాజకీయాల కారణంగానే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? దౌర్జన్యం చేసే దొరలను గాడిలో పెట్టినందుకా? లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్లినందుకా?

ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీకి తమ్ముడి కూతురు లేఖ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి/ కోరుట్ల : ‘రాజులు, రాజకీయాల కారణంగానే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? దౌర్జన్యం చేసే దొరలను గాడిలో పెట్టినందుకా? లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్లినందుకా? ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే ఏదో ఆందోళన కలుగుతున్నది. ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న..’ అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీకి ఆయన తమ్ముడి కూతురు సుమ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవ్‌జీకి ఆయన కుటుంబ సభ్యురాలు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ‘మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇంతవరకు ఆ అవకాశం నాకు రాలేదు పెదనాన్న..’ అంటూ లేఖ ద్వారా సుమ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆపరేషన్ కగార్ పేరిట ఎన్‌కౌంటర్‌కు గురైన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మనదేశంలోకి చొరబడి మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా ఈ దేశపు బిడ్డలైన మీపై ఎందుకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు’ అంటూ సుమ ఆవేదన వ్యక్తం చేసింది.

ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు?

‘కన్నోళ్లను, కట్టుకున్నోళ్లను విడిచి అడవుల బాట పట్టారు. పేదోళ్ల కష్టాలు తీరాలని మీ ఆనందాలను వదులుకుని, కార్లు బంగాళాలు కాదని, కారడవుల్లో ఉన్నారు’ అంటూ సుమ లేఖలో ప్రస్తావించింది. అసలు ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకని, ఎన్‌కౌంటర్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘దేశం కోసం సమాజ నిర్మాణం కోసం వెళ్లిన మీరు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తిరిగి ఇంటికి వచ్చేయండి.. మీకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న.. మమ్మల్ని మరవద్దు..’ అంటూ కుటుంబ సభ్యులు పడుతున్న తాపత్రయాన్ని లేఖ ద్వారా తెలిపింది.

Next Story