హోటల్‌లో సీనియర్ల సమావేశం.. రంగంలోకి ఏఐసీసీ​

by Disha Web Desk 4 |
హోటల్‌లో సీనియర్ల సమావేశం.. రంగంలోకి ఏఐసీసీ​
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ నేతలు బిజీ అయ్యారు. రేవంత్​ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు హోటల్​ అశోకా వేదికగా మధ్యాహ్నం భేటీ కానుండగా.. ఈ పరిణామాలను పట్టించుకోనట్టే టీపీసీసీ చీఫ్​ మన ఊరు–మన పోరుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ సైతం రంగంలోకి దిగారు. వీహెచ్​ నిర్వహిస్తున్న సమావేశానికి ఎవరెవరు వెళ్తున్నారనే అంశంపై ఆరా తీశారు. కొంతమంది నేతలకు ఫోన్​ చేసి మాట్లాడారు. దీంతో పలువురు నేతలు వీహెచ్​ సమావేశానికి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ఫోన్లు స్విచ్ఛాప్​ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్​బాబు స్థానికంగా ఉండకుండా అటవీ ప్రాంతంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ముందేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేనంటూ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.

సాయంత్రం ఎల్లారెడ్డికి రేవంత్​

కాగా, సీనియర్ల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి కొంత భరోసా ఇచ్చేలా ఏఐసీసీ నుంచి సంకేతాలు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ద్వారా ఏఐసీసీ నేతలు రేవంత్​కు గో హెడ్​ అనే సమాచారమిచ్చినట్లు టాక్​. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు వ్యతిరేకించిన మన ఊరు– మన పోరును కంటిన్యూ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రేవంత్​రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అశోకా హోటల్​కు వచ్చేదెవరో..

ఇక, హోటల్​ అశోకా వేదికగా వీహెచ్​ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంపై కొంత ఆసక్తి నెలకొంది. కొంతమంది సీనియర్లు దాదాపుగా రామంటూ సమాచారం పంపించారు. శనివారం రాత్రి నుంచి ఠాగూర్​ ఫోన్లతో పలువురు వెనకాడుతున్నారు. అయితే, జగ్గారెడ్డి, రాజగోపాల్​రెడ్డి మాత్రమే ఈ సమావేశానికి వెళ్తారని సమాచారం. మిగిలిన నేతలు గీతారెడ్డి, శ్రీధర్​బాబు వంటి వారు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం అని సమాచారమిచ్చినా.. మధ్యాహ్నం వరకు నిర్వహించే అవకాశాలున్నాయి.

Next Story

Most Viewed