రాష్ట్రానికి తొలిసారి కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్.. వీహెచ్ ఆందోళన

by Disha Web Desk |
రాష్ట్రానికి తొలిసారి కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్.. వీహెచ్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్‌గా నియమితులైన మాణిక్ రావు థాక్రే మొదటి సారి రాష్ట్రానికి వచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు రాష్ట్రానికి విచ్చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మాణిక్ రావ్ థాక్రేకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌తో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం మాణిక్‌ రావ్ థాక్రే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గాంధీ భవన్‌‌కు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు థాక్రే గాంధీభవన్‌లో వివిధ స్థాయి నేతలతో భేటీ అవుతారు. ఇందులో తొలుత ఆయన ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించనున్నారు. ఆ తర్వాత పలువురు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో థాక్రే సమావేశం కానున్నారు. మధ్యాహ్నం పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ ఆఫీసర్ బేరర్లతో భేటీ అవుతారు. ఇక, గురువారం ఉదయం 10.30 గంటలకు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ అవుతారు. అలాగే ఇతర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

వీహెచ్ ఆందోళన...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీహెచ్ ఆందోళన చేశారు. కొత్త ఇన్ ఛార్జ్‌గా నియమితులై తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన మాణిక్ రావ్ థాక్రేకు స్వాగతం పలికేందుకు వెళ్లిన వీహెచ్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, ఎయిర్ పోర్టు ముందు బైఠాయించి వీహెచ్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

థాక్రేకు వెంకట్‌రెడ్డి ఫోన్...

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాణిక్ రావ్ థాక్రేకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి తొలిసారి విచ్చేస్తున్న థాక్రేకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డిని వీలుచేసుకుని గాంధీభవన్‌కు రావాలని థాక్రే ఆహ్వానించారు. కానీ, థాక్రేను బయటే కలుస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. దీంతో థాక్రేను వెంకట్ రెడ్డి కలుస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు మాట్లాడుతూ.. మాణిక్కం ఠాగూర్ తో సమస్యలు ఏమీ లేవని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే ఉందని తెలిపారు. ఇక, కొత్త ఇంచార్జీతో పార్టీలో పరిస్థితులు అన్ని సర్దుకుపోతాయని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 77 సీట్లతో కాంగ్రెస్ గెలుపొందుతుందని అన్నారు.



Next Story

Most Viewed