గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తొందరపడ్డారా?

by Dishanational2 |
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తొందరపడ్డారా?
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో / సికింద్రాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లలేదని సిట్​అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిపిన విచారణలో ఏఈ సివిల్, జనరల్​నాలెడ్జి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కొన్నవారే పట్టుబడటం దీనిని స్పష్టం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్​పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం తొందరపాటు చర్యే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టౌన్​ప్లానింగ్​బిల్డింగ్​ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్​సర్జన్ల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైనట్టు వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి కలిసి ఏఈ సివిల్స్, జనరల్​స్టడీస్​ప్రశ్నపత్రాలను బోర్డు కాన్ఫిడెన్షియల్​రూంలోని కంప్యూటర్​నుంచి తస్కరించినట్టు వెల్లడైంది. ఆ తరువాత సిట్ అధికారులు జరిపిన విచారణలో గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రాన్ని ఈ ఇద్దరు చోరీ చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఈ అంశంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ప్రతిపక్షపార్టీలు ఈ స్కాంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందంటూ విమర్శలు గుప్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ అధినేత ప్రవీణ్​కుమార్​తదితరులు ఒకడుగు ముందుకేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. కేటీఆర్​వద్ద పీఏగా ఉన్న తిరుపతికి ఈ స్కాంలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రిలిమ్స్​రాసిన అభ్యర్థులు సైతం పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్​చేశారు.

దర్యాప్తులో..

అయితే, సిట్​ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లలేదని స్పష్టమంది. ప్రశ్నపత్రాన్ని తస్కరించడంలో కీలకపాత్ర పోషించిన బోర్డు ఉద్యోగి ప్రవీణ్, మరో ఉద్యోగిని షమీమ్, డేటా ఎంట్రీ ఆపరేటర్​రమేశ్, మాజీ ఉద్యోగి సురేశ్ మాత్రమే ఈ పరీక్ష రాసినట్టుగా నిర్ధారణ అయ్యింది. న్యూజిలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్​రెడ్డి బావ ప్రశాంత్​రెడ్డి ఈ పరీక్ష రాసినట్టుగా తెలిసింది. అయితే, ఇది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే ప్రశాంత్​రెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ సిట్​అధికారులు సమాచారం ఇచ్చారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం బయటివ్యక్తులకు ఇవ్వలేదని ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి చెబుతున్నారు. రేణుక, ఆమె భర్త డాక్యా తమ చేతికి గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రం రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలో వందకు పైగా మార్కులు సాధించిన కొంతమందిని సిట్​కార్యాలయానికి పిలిపించి విచారించారు. వీరికి ఎఫీషియన్సీ టెస్టు పెట్టారు. దీంట్లో అభ్యర్థులు జవాబులు బాగానే రాయడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లలేదని సిట్​అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు జరిగిన అరెస్టులన్నీ ఏఈ సివిల్, జనరల్​నాలెడ్జి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల వ్యవహారంలోనే జరిగాయి.

తొందరపాటు నిర్ణయమా?

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్​పరీక్షను రద్దు చేస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకుందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. సిట్​అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపకుండానే ప్రశ్నపత్రం లీక్​అయినట్టుగా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. ప్రశ్నపత్రం లీకైన విషయం వాస్తవమే అయినా అది బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? లేదా? నిర్ధారించుకున్న తరువాతే పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గ్రూప్-1 మెయిన్స్​జూన్​11న ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపటానికి సిట్​వద్ద కావాల్సినంత సమయం ఉన్నా హడావుడిగా ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు చెందిన ఉద్యోగులకు మాత్రమే గ్రూప్​-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రం అందినట్లు స్పష్టమవుతోంది. వీరిని అనర్హులుగా ప్రకటిస్తే సరిపోయేదని, పరీక్షను రద్దు చేయడంతో 25 వేల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలి

టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి మేం నష్టపోవాల్సి వస్తోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే మా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుత పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాను. క్వాలిఫై అయి లాభం లేకుండా పోయింది. మెయిన్స్‌కు ఎంపికైనా మళ్లీ చదవాల్సిన పరిస్థతి ఏర్పడింది. ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలి. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.20 వేలు నిరుద్యోగభృతి చెల్లించాలి. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలి.

- వలిగొండ నరసింహ, (మెయిన్స్‌కు ఎంపికైన పొలిటికల్​సైన్స్​డిపార్ట్‌మెంట్​పరిశోధక విద్యార్థి)

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

తొమ్మిదేళ్ల కల చెదిరిపోయింది. కష్టపడి చదివి గ్రూప్స్-1 ప్రిలిమ్స్ రాసి పాసయ్యాను. పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేశారు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులను తొలగించి కొత్తవారిని నియమించాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాకు ప్రభుత్వమే భరోసా కల్పించాలి. మున్ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

- క్రాంతి, ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి

కలలన్నీ కల్లలయ్యాయి

ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామి అవుదామని కలలు కన్నాను. గ్రూప్-1 ద్వారా ఆర్డీవోగా ఉద్యోగం సంపాదించి కష్టపడి చదివించిన అమ్మా, నాన్నల రుణం తీర్చుకుందామని అనుకున్నాను. కలలన్నీ కల్లలైపోయాయి. కష్టపడి చదివి ప్రిలిమ్స్ రాశాను. మెయిన్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో పేపర్ లీకేజీతో గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేలినట్లైంది. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి న్యాయం చేయాలి.

- సత్యనారాయణ, తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి

మా జీవితాలతో ఆడుకుంటున్నారు

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో కష్టపడి చదివి గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికయ్యా. ఉద్యోగం సంపాదించే వరకు ఇంటికి వెళ్లొద్దని నిర్ణయించుకొని ఓయూలోనే ఉంటున్నా. పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేశారు. ఇప్పుడేమో బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్టు నిర్ధారణ కావడం లేదని చెబుతూ మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మళ్లీ చదివి పరీక్ష రాయాలంటే సమయంతోపాటు డబ్బులతో కూడుకున్న వ్యవహారం.

- కరణ్, ఎల్​ఎల్​బీ విద్యార్థి

Next Story

Most Viewed